ఆ గోడ నిర్మాణానికి రూ.40 వేల కోట్లు కావాలి
అమెరికా దక్షిణ సరిహద్దుల్లో భారీ గోడ నిర్మాణం కోసం రూ.40వేల కోట్ల నిధులు మంజూరయ్యేందుకు సహకరించాలని ప్రతిపక్ష డెమోక్రాట్లను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. దేశం ఎదుర్కొంటున్న మానవీయ, భద్రతపరమైన సంక్షోభాన్ని ఆపేందుకు ఈ గోడ అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ అంశంపై జాతినుద్దేశించి తొలిసారిగా ఆయన టీవీ ప్రసంగం చేశారు. ఇటీవల కాలిఫోర్నియాలో అక్రమ వలసదారుడి చేతిలో భారత సంతతి పోలీసు రోనిల్ సింగ్ హత్యకు గురైన ఉదంతాన్ని ఆయన ఇందులో ప్రస్తావించారు. ట్రంప్ ప్రసంగాన్ని అమెరికాలోని అన్ని ప్రధాన టీవీ నెట్వర్క్లూ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో భారీ గోడ నిర్మిస్తానని ట్రంప్ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రభ్వుత వ్యయ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం లభించట్లేదు. దీంతో డిసెంబర్ 22న ట్రంప్ ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది.













