నాగ్ పూర్ లో ఘనంగా పాఠశాల వసంతోత్సవం
నాగ్పూర్లోని ఆంధ్ర ఆసోసియేషన్ నిర్వహిస్తున్న తెలుగు పాఠశాల తరగతులు ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా వసంతోత్సవం నిర్వహించారు. జనవరి 6వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి ఎం.చంద్రశేఖర్, పాఠశాల వ్యవహారాలను చూస్తున్న మేనేజర్ ఎం.సంధ్యరెడ్డి, పాఠశాల టెక్స్ట్బుక్స్ రచయిత సుషుమ్న రావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పార్వతీ కల్యాణం హరికథ వచ్చినవారిని ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల ద్వారా తెలుగు నేర్చుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం సుషుమ్న మాట్లాడుతూ పిల్లలు తెలుగు పదాలను అర్థం చేసుకుని క్రమం తప్పకుండా మాట్లాడాలని అప్పుడే భాషలో పరిపూర్ణతను సాధించగలరన్నారు. ఇంట్లో కూడా తెలుగు మాట్లాడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. మురళిధర్, ప్రధాన కార్యదర్శి పి.ఎస్.ఎన్.మూర్తి, సమన్వయ కర్త పి.టి.శర్మ అతిథులను సన్మానించారు.













