న్యూజెర్సీలో ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అమెరికాకు వచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతిక విభాగం శాఖాధిపతి ఆచార్య డా. లక్ష్మీనారాయణతో ఉస్మానియా పూర్వ విద్యార్థులు న్యూజెర్సీలో మొఘలాయ్ దర్బార్లో సమావేశమై విశ్వవిద్యాలయంకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వివిధ రంగాలలో నిష్టాతులైన ఆచార్యులు, శాస్త్రవేత్తలు, వాణిజ్య రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు విశ్వవిద్యాలయం బాగోగుల గురించి మాట్లాడారు.
ఆచార్య లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక, నిర్మాణాత్మకమైన అంశాలపై దృష్టి సారించిందని తెలిపారు. ప్రవాస ఉస్మానియా అంతా ఇందులో భాగస్వాములవ్వాలన్నారు. శతవసంతాలు పూర్తి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా జాతీయ అంచనా గుర్తింపు కౌన్సిల్ విభాగం ఉత్తమ విశ్వవిద్యాలయం గుర్తింపు రావటం మనందరికీ గర్వకారణం అన్నారు.
నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, ఉస్మానియా అమెరికా విభాగం నోడల్ అధికారి మాట్లాడుతూ ఉస్మానియా నోడల్ అధికారిగా ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించటం తనకి ఎంతో ఆనందంగా ఉందని, తనపై నమ్మకముంచి ఈ బాధ్యతని ఇచ్చినందుకు ఉపకులపతి ఆచార్య రామచంద్రంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని ప్రతి ఉస్మానియా పూర్వ విద్యార్థిని విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంచటం ఈ బాధ్యత ముఖ్య ఉద్దేశమని అన్నారు. జనవరిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, భారత వాణిజ్య సదస్సు అక్టోబర్లో వచ్చే సంవత్సరం జరుగుతుందని ఈ రెండు గొప్ప సదస్సులు ఉస్మానియా వేదికగా జరుగుతుండటం మనకి ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒక్కసారైన విశ్వవిద్యాలయం సందర్శించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయం (సుని) ఫ్యాషన్ టెక్నాలజీ రిజిస్ట్రార్గా పని చేస్తున్న ఉస్మానియా పూర్వ విద్యారిథ ఆచార్య రాజశేఖర్రెడ్డి వంగపర్తి మాట్లాడుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిఫ్ట్) సునితో అనుబంధంగా పనిచేస్తుందని ఉస్మానియాని కూడా ఇందులో భాగస్వాములుగా చేసేలా ప్రతిపాదన చేస్తామన్నారు. డా. రవి మేరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్రం పూర్వ విద్యార్థి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల పేరుతో ఏదో ఒక మంచి పని చేస్తున్నామని చెప్పారు. మరో పూర్వ విద్యార్థి శరత్ వేముల మాట్లాడుతూ ప్రతి ఉస్మానియా విద్యార్థికి యూనివర్సిటీతో ఎంతో అనుబంధం ఉంటుందని కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చేయాలనీ ఉంటుందని నిజానికి అది ఒక బాధ్యతాయుత అంశమని అన్నారు. ఈ విషయంలో తాను ముందు ఉంటానని పేర్కొన్నారు.
ఉస్మానియా సాంఖ్యక శాస్త్రం పూర్వ విద్యార్థి విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం చేపడుతున్న అనేక కార్యక్రమాలలో పూర్వ విద్యార్థుల పాత్ర చాలా ఉండాలని పిలుపునిచ్చారు. రీసెర్చ్ విద్యార్థులకి తగిన సదుపాయాలు కల్పించటంలో ప్రవాస ఉస్మానియా పూర్వ విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా పరిశోధన రంగానికి ఉస్మానియా పెట్టింది పేరని వారికి ఉపయుక్తమైన ల్యాప్ టాప్లు ఇస్తే వారు ప్రపంచంతో అనుసంధానమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.
శరత్ వేముల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా. రవి మేరెడ్డి మరియు డా మాధవ్ లు ఆచార్య లక్ష్మి నారాయణ ను శాలువతో సత్కరించగా పూర్వ విద్యార్థి నరేష్ తుళ్లూరి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా అమెరికా విభాగం నోడల్ అధికారి నరసింహరెడ్డి దొంతిరెడ్డి, డా రవి. మేరెడ్డి, శరత్ వేముల, డా. మాధవ్ మోసర్ల, విలాస్ జంబుల, ఆచార్య రాజశేఖర్ వంగపర్తి, ఆచార్య రవీందర్ రెడ్డి రేగట్ట. డా అజయ కట్ట, రామ మోహన్ రెడ్డి , నరేష్ తుళ్లూరి, పున్నరెడ్డి మండల, రోహిత్ పున్నాం, ద్వారకనాథ్ రెడ్డిలు పాల్గొన్నారు.













