ఎన్నికల్లో ఓటుపై ఎన్నారైలకు వెసులుబాటు….
విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు మన దేశంలో జరిగే అన్నీ ఎన్నికల్లో పాల్గొనే విధంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత మూడేళ్లలో ఎన్నడూలేని విధంగా విదేశీ ఓటర్ల సంఖ్య రెండు రెట్లు పెరిగిందని తాజా గణాంకాలను బట్టి స్పష్టమవుతుంది. అయితే విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్యతో పోలిస్తే ఈ ఓటర్ల సంఖ్య చాలా తక్కువని – వీరిని కూడా ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను ముమ్మర ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం – ఈసీ డేటా స్పష్టం చేస్తోంది.
సర్వీసు ఓటర్లకు అందిస్తున్నట్టుగానే ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ హక్కును కల్పించేందుకు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఎన్నారై ఒటింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో భారత్ కు వచ్చి ఓటు వేయడం అన్నది ప్రవాస భారతీయులకు అనేక రకాలుగా ఇబ్బందికరంగా మారుతున్న దష్ట్యా – వీటికి పరోక్ష ఓటింగ్ హక్కును కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ బిల్లును తలపెట్టింది.
తన తరఫున పరోక్షంగా ఓటువేసే హక్కును భారతదేశంలో వున్న తమవారికి అందించే అవకాశాన్ని ఈ బిల్లు ద్వారా ఎన్నారైలకు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అన్ని ఎన్నికల్లోనూ ఓకే వ్యక్తి ఎన్నారై ఒటరు తరఫున ఓటు వేసే అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు ఈ ప్రాగ్జి ఓటరును మార్చుకోవాలన్న నిబంధన కూడా ఈ బిల్లులో ఉంది.













