ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 94వ జయంతి వేడుకలు
జూన్ 3న అట్లాంటాలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి 94వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పెర్సిస్ ఇండియన్ రెస్టారెంట్ లో, ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవేడుకలకు తాతకు తగ్గ మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ పాల్గొనడం విశేషం. ముందుగా రాజేష్ జంపాల స్వాగతోపన్యాసం చేయగా, నందమూరి కళ్యాణ్ రామ్ మరియు తానా పూర్వ అధ్యక్షులు వడ్లమూడి రామ్మోహనరావు గార్లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ ఒక ప్రత్యేక వీడియోని ప్రదర్శించారు. తదనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ తన తాత నందమూరి తారక రామారావు గారితో ఉన్న అనుబంధాన్ని గురించి ప్రసంగించారు. అలాగే తన విద్యాభ్యాసం, కుటుంబ జీవితం, మరియు సినిమాల గురించి సభికులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఎంతో ఓర్పుగా సమాధానాలు ఇచ్చారు. చివరిగా తెలుగు వారందరు కలిసి మెలిసి ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తదనంతరం జోహార్ ఎన్టీఆర్ నినాదాల నడుమ కళ్యాణ్ రామ్ కేక్ కట్ చేసి అభిమానులకు మరియు ఆడపడుచులకు స్వయంగా కేక్ అందించారు. అలాగే ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ ఎంతో ఓపికగా ఫోటోలు దిగారు. సెలబ్రిటీ అనే భేషజం లేకుండా అందరితో కలిసిపోయి ఎంతో ఉత్సాహంగా అందరిని ఆహ్లాదపరిచిన కళ్యాణ్ రామ్ ని అందరూ డౌన్ టు ఎర్త్ అంటూ పొగడడం విశేషం. ఈ సందర్భంగా నరేంద్ర సూరపనేని ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రకాశం బ్యారేజ్ లాంటి ఒక మంచి ప్రజా ప్రదేశంలో ప్రతిష్టించేందుకు కృషి చేయాలని కళ్యాణ్ రామ్ గారిని కోరారు. కొన్నిగంటల్లో ఇండియా తిరిగి వెళ్లే పనిలో తీరికలేకుండా ఉండి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా సభ్యుల కోరిక మేరకు ఎన్టీఆర్ జయంతి వేడుకలకు విచ్చేసిన కళ్యాణ్ రామ్ గారికి మురళి బొడ్డు పుష్ఫగుచ్ఛం అందజేయగా, శ్రీనివాస్ లావు మరియు అంజయ్య చౌదరి లావు శాలువాతో సత్కరించారు.
అలాగే బాలా రెడ్డి ఇందుర్తి, షీలా లింగం, సుబ్బారావు మద్దాళి, సుధాకర్ వల్లూరుపల్లి, శ్రీనివాస్ కడియాల మరియు ప్రభాకరరావు కడియాల తదితరులు ఎన్టీఆర్ పుట్టుపూర్వోత్తరాలు, సినీ జీవితం, రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రిగా తను పేదలకోసం ప్రారంభించిన ప్రజాహిత కార్యక్రమాల గురించి ప్రసంగించారు. మన అట్లాంటా తెలుగు సినీ హీరో శత్రుఘ్న రాయపాటి దానవీరశూరకర్ణ సినిమాలోని ఏమంటివి ఏమంటివి అనే ఎన్టీఆర్ సంభాషణ చెప్పి సభికులను ఉర్రూతలూగించారు. తర్వాత వెంకీ గద్దె ప్రసంగిస్తూ 2008 లో ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా తరపున ఎన్టీఆర్ జయంతి వేడుకలు మొట్టమొదటిసారి ప్రారంభించగా, ప్రతి సంవత్సరం అప్రతిహాతంగా నిర్వహించడం అలాగే ఈ సంవత్సరం 10వ వేడుకలు కావడం అందునా ఆ నందమూరి వారసులు కళ్యాణ్ రామ్ పాల్గొనడం హర్షతిరేకం అన్నారు. సుమారు 150 మందికి పైగా పాల్గొని ఎన్టీఆర్ జయంతి వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి కళ్యాణ్ రామ్ గారిని తీసుకువచ్చిన చక్రి సూరపనేని గారికి కృతఘ్నతలు తెలియజేసారు. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు అనిల్ యలమంచిలి, వినయ్ మద్దినేని, వెంకట్ అడుసుమిల్లి, భరత్ మద్దినేని, శ్రీహర్ష యెర్నేని, మల్లిక్ మేదరమెట్ల, ఉపేంద్ర నర్రా, శ్రీనివాస్ నిమ్మగడ్డ, విజయ్ కొత్తపల్లి, వేదికను మరియు తేనీయ విందు అందించిన పెర్సిస్ రెస్టారెంట్ యజమానులు శ్రీధర్ దొడ్డపనేని, అలాగే మిత్రులు బిల్హన్ ఆలపాటి, శ్రీనివాస్ రాయపురెడ్డి, మధు యార్లగడ్డ, వెంకట్ మీసాల, రాజు మందపాటి, అనిల్ కొల్లి, గిరి సూర్యదేవర, ఇన్నయ్య ఎనుముల, చవన్ కోయ, హేమంత్ వర్మ పెన్మెత్స, రామ్ మద్ది, మహేష్ పవార్, తిరు చిలపల్లి, ప్రణీత్ కావూరి, మురళి కిలారు, బాలనారాయణ మడ్డ, శ్రీనివాస్ గుంటక, విశాల్ మాదల, ప్రశాంత్ కొల్లిపర, శ్రీకాంత్ పుట్టి తదితరులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.













