70 పాయింట్లొస్తే బ్రిటన్ వీసా!
బ్రెగ్జిట్ అనంతరం తీసుకొచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు సంబంధించిన వివరాల్ని యూకే ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ వీసా నిబంధనల్ని యూకే హోం మంత్రి ప్రీతీ పాటిల్ వివరించారు. జనవరి 1, 2021 తర్వాత బ్రిటన్లో నివసించడం లేదా ఉద్యోగం చేయాలనుకుంటున్నవారు కనీసం 70 పాయింట్లను సాధించాలని ఆమె పేర్కొన్నారు. ఇంగ్లిష్ మాట్లాడే సామర్ధ్యం, బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలో ఉద్యోగం లేదా ఏడాదికి 22 వేల పౌండ్ల కంటే ఎక్కువ ఆదాయం తదితరాలను ఆధారంగా చేసుకొని ఈ పాయింట్లను కేటాయిస్తామన్నారు. నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సంస్థలకు బ్రిటన్ సాదర స్వాగతం పలుకుతున్నది అని ఆమె తెలిపారు. ప్రమాణాలు పాటిస్తూ, నైపుణ్యం అభివృద్ధికి దోహదం చేసే సంస్థలకు వచ్చే ఏడాది జనవరి నుంచి అనుమతులను ఇవ్వబోతున్నామని వెల్లడించారు. బ్రిటన్ తాజా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను భారత పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. కాగా జనవరి1, 2021 నుంచి బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి అధికారికంగా (బ్రెగ్జిట్) వైదొలుగుతుంది.













