ఇర్వింగ్ లో అగ్నిప్రమాద బాధితులకు నాట్స్ సాయం
ప్రమాద బాధితులైన తెలుగువారికి భరోసా ఇచ్చిన నాట్స్
అమెరికాలోని ఇర్వింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై నాట్స్ శరవేగంగా స్పందించింది. భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంపై నాట్స్ అత్యవసర సహాయ బృందం రంగంలోకి దిగి బాధితులకు సాయం అందించింది. నాట్స్ నాయకులు బాపునూతి, రాజేంద్ర మాదల తో పాటు పలువురు నాట్స్ బృంద సభ్యులు ఈ ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్ధలికి చేరుకున్నారు.
ఈ ప్రమాదంలో బాధితులు చాలావరకు తమ విలువైన డాక్యుమెంట్లను కూడా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్యంగా తెలుగుకుటుంబాలు అధికంగా ఉండే ప్రాంతంలో తెలుగు విద్యార్ధులు కూడా ఇక్కడే గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అగ్ని ప్రమాదంలో తమ వస్తువులు అన్ని కూడా కాలిపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి గాయలు, ప్రాణహాని జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారికి నాట్స్ నాయకులు బాపు నూతి, రాజేంద్ర మాదల బాధితులకు ధైర్యం చెప్పారు. నాట్స్ తనవంతు సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. అసలు ప్రమాదానికి కారణాలేమిటనేదానిపై స్థానిక అధికారులు విచారణ చేస్తున్నారు. అగ్ని ప్రమాద బాధితులు కోలుకునేందుకు నాట్స్ ఎప్పటికప్పుడూ వారితో సంప్రదిస్తూ కావాల్సిన సహాయ సహకారాలు మరికొద్ది రోజుల పాటు అందించనుందని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. తెలుగువారికి అమెరికాలో ఏ ఆపద వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.













