ఆఫ్రికాలో ఇవాంక ట్రంప్ పర్యటన
ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఇవాంక ట్రంప్ పర్యటించారు. పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని ఆమె కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించే దిశగా ట్రంప్ సర్కార్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని ఇవాంక చెప్పారు. 2025 నాటికి 5 కోట్ల మంది మహిళలకు ఉద్యోగవకాశాలు కల్పించే దిశగా అన్ని దేశాలను తాను కోరనున్నట్లు తెలిపారు. కాగా నాలుగు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఇవాంక ఇథియోపియాలో పర్యటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉమెన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పారిటీ పేరిట ఆమె ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మహిళల సాధికారిత కోసం విశేష కృషి చేస్తున్నారు. ఇవాంక ప్రవేశపెట్టిన ప్రాజెక్టు కోసం యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏయిడ్ ఏజెన్సీ 50 మిలియన్ డాలర్లు (రూ.345 కోట్లు) ఖర్చు చేస్తున్నది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఆమె సమావేశం కానున్నారు.













