ప్రపంచాన్ని ఏలేస్తున్న ప్రవాస భారత సారథులు
భారతీయుల ప్రతిభ అంతర్జాతీయంగా ఫరిడలిల్లుతోంది. 11 దేశాల్లోని ఎన్నో కంపెనీల్లో భారత సంతతికి చెందిన 58 మంది కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వహిస్తుండటమే కాదు.. వీరి నిర్వహణలోని కంపెనీలు 36 లక్షల మందికి ఉపాధి కల్పించడంతో పాటు లక్ష కోట్ల డాలర్ల ఆదాయం (రూ.75 లక్షల కోట్లు), 4 లక్షల కోట్ల డాలర్ల (రూ.300 లక్షల కోట్లు) మార్కెట్ విలువను కలిగి ఉన్నట్టు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇండియాస్పోరా అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. గతంలో లేని విధంగా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తల కార్పొరేట్ విజయాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నట్టు ఈ సంస్థ అభివర్ణించింది. వీరిలో చాలా మంది తమ వేదికల ద్వారా సామాజిక మార్పుల కోసం పాటు పడుతున్నట్టు పేర్కొంది.
భారత సంతతికి చెందిన 58 ఎగ్జిక్యూటివ్ల వివరాలను ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు, సిలికాన్ వ్యాలీకి చెందిన వ్యాపారవేత్త రంగస్వామి విడుదల చేశారు. వీరి సారథ్యంలో ఆయా కంపెనీలు వార్షికంగా 23 శాతం రాబడులను ఇచ్చినట్టు చెప్పారు. ఈ జాబితాలో ఆల్ఫాబెట్ (గూగుల్) సీఈవో సుందర్ పిచాయ్, మాస్టర్కార్డ్ సీఈవో అజయ్బంగా, వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ఎండీ, సీఈవో రేష్మ కేవల్రమణి తదితరులు ఉన్నారు. భారత సంతతికి చెందిన సీఈవోలు భారత్ నుంచి వలసవచ్చిన వారు. అదే విధంగా వివిధ దేశాల్లో జన్మించిన భారత సంతతి వారి పేర్లు ఇందులో చోటుచేసుకున్నాయి. ఈ కంపెనీలు కరోనా వెలుగు చేసిన తర్వాత మానవతా చర్యలు చేపట్టినట్టు రంగస్వామి తెలిపారు.













