యూఎస్ నిర్బంధంలో మరో భారతీయుడు మృతి
అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న భారత్కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మే 10న ఈక్వెడార్ నుంచి అట్లాంటా వచ్చిన అతుల్కుమార్ బాబుధాయ్ పటేల్ భారతీయుడిని విమానాశ్రయంలోనే నిర్బందించారు. ఇమిగ్రేషన్ పత్రాలు సరిగా లేవనే ఆరోపణలతో పటేల్ను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రాటెక్షన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఇయన ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించారు. రెండు రోజుల పాటు పటేల్ను అట్లాంటా సిటీలోని డిటెన్షన్ సెంటర్లో నిర్బందించి ఉంచారు. పటేల్కు డయోబెటిక్, అధిక రక్తపోటు ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన్ని పరీక్షించిన నర్సు పటేల్కు బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉందని, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతున్నాడని అధికారులకు చెప్పడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరకుండానే ఆయన ప్రాణాలు విడిచారు. పటేల్ మృతి గురించి అధికారులు అమెరికాలోని భారత ప్రతినిధులకు, ఆయన కుటుంబానికి సమాచారాన్ని చేరవేశారు. తమ అదపులో ఉన్న వ్యక్తులు చనిపోయిన ఘటనలు చాలా అరుదుగా ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారులు చెప్పుకొచ్చారు.













