డొనాల్డ్ ట్రంప్ ను పిలవలేదు… కానీ భారత చెఫ్ కు ఆహ్వానం
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మెర్కెల్ల వివాహానికి భారత సంతతికి చెందిన ఓ చెఫ్కు ఆహ్వానం అందింది. రాజకుటుంబీకులు హ్యారీ వివాహానికి చాలా తక్కువ మందిని ఆహ్వానిస్తున్నారు. పెళ్లికి ఆహ్వానించిన వారిలో భారత సంతతికి చెందిన యువ వ్యాపార వేత్త, ప్రముఖ చెఫ్ అయిన రోసీ గిండే కూడా ఉన్నారు. మే 19న విండ్సర్ క్యాసెల్లో జరిగే హ్యారీ వివాహానికి కేవలం 1200 మంది అతిథులను ఆహ్వానిస్తున్నారు. రాకుమారుడి వివాహానికి తనకు అందిన ఆహ్వాన పత్రిక చూసి రోసి ఆనందంలో మునిగిపోయారు. రోసీ యూకేలో ఉంటున్న పంజాబీ దంపతులకు జన్మించారు. హ్యారీ, మేఘన్ల వివాహానికి ఆహ్వానితుల్లో ప్రత్యేకంగా రాజకీయ నాయకుల జాబితా ఏమి లేదని రాజకుటుంబం వెల్లడించింది. అంటే బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానం లేనట్లే కనిపిస్తోంది. తమ వివాహానికి వచ్చే కానుకలను పలు ఛారిటీ సంస్థలకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే హ్యారీ, మేఘన్లు వెల్లడించారు.













