హార్వీ హరికేన్ బాధితుల కోసం ఇండియన్ అమెరికన్ డాక్టర్ల సహాయ నిధి
అమెరికా రాష్ట్రమైన టెక్సాస్లో హార్వీ హరికేన్ కారణంగా సంభవించిన వరద బాధితుల కోసం ఇండియన్ అమెరికన్ డాక్టర్లు సహాయ నిధిని ప్రారంభించారు. భారీ ఈదురు గాలులు, ఆకస్మికంగా సంభవించిన వరదలతో టెక్సాస్ రాష్ట్రం తీవ్రంగా విధ్వంసానికి గురైందని, ఈ ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయని, ఈ విషాద సమయంలో బాధితులకు అండగా నిలబడాలని తాము భావించామని భారత సంతతికి చెందని అమెరికన్ డాక్టర్ల సమాఖ్య (ఎఎపిఐ) అధ్యక్షుడు గౌతమ్ సమద్దర్ తెలిపారు. కొంతమంది ఎఎపిఐ సభ్యులు కూడా ఈ బాధితుల్లో వున్నారని చెప్పారు. విరాళాల ద్వారా సేకరించిన మెత్తాలను టెక్సాస్ గవర్నర్కు అందచేయనున్నట్లు తెలిపారు. అమెరికాలోని డాక్టర్లలో ఎఎఐపి డాక్టర్లు 10 శాతం వరకు వున్నారని, వీరు 30 శాతం రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. వచ్చే రెండు నుండి నాలుగు వారాల వరకు తమ వద్దకు వచ్చే రోగులకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా చికిత్సనందించాలని ఆయన టెక్సాస్లోని డాక్టర్లను కోరారు.













