సిలికానాంధ్ర వర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ ప్రోగ్రాంకు గ్రీన్ సిగ్నల్
యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాస్టర్ సైన్స్ ప్రోగ్రాం ప్రారంభించేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ మేరకు డబ్ల్యూ ఎస్సీయూసీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు వర్సిటీ వెల్లడించింది. ఈ కోర్సు వచ్చే జనవరి అంటే 2023 జనవరి నుంచి మొదలవుతుందని తెలిపింది. ఇది సిలికానాంధ్ర యూనివర్సిటీలో మొదటి ఆన్-క్యాంపస్ ప్రోగ్రాం కావడం గమనార్హం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషీన్ లెర్నింగ్, మెషీన్ ట్రాన్స్లేషన్ తదితర మోడర్న్ సాంకేతికతలను ఉపయోగించుకోవడంలో విద్యార్థులకు ఈ ఎంఎస్ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. తద్వారా కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ విభాగంలో ఎనలేని కృషి జరుగుతుందని, విద్యార్థులు-ఫ్యాకల్టీ తయారు చేసే సరికొత్త యాప్స్ ద్వారా వివిధ భాషలు మాట్లాడే లక్షలాది మందికి ఉపయోగం ఉంటుందని వర్సిటీ ప్రతినిధులు అన్నారు.













