తానా పాఠశాల సమ్మర్ క్యాంప్… 300 మంది విద్యార్థుల హాజరు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని చిన్నారులకు తెలుగుభాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ నిర్వహిస్తున్న నాలుగువారాల సమ్మర్ క్యాంప్కు మంచి స్పందన వచ్చింది. ప్రతి శని, ఆదివారాల్లో ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్లో దాదాపు 300కుపైగా విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ‘‘ధర్మ’’ క్యాంప్ లో రామాయణ భారత భాగవతాలు, భగవద్గీత, శతక పద్యాల వంటి వాటితో బాటూ, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ‘‘వినోదం’’ కార్యక్రమంలో తెలుగు భాష, సాహిత్యం, తెలుగు ప్రముఖులు మొదలైన అనేక ఆసక్తికర అంశాలతో బాటూ పిల్లల్ని అలరించే పొడుపు కథలు, సామెతలు వంటి కార్యక్రమాలు నేర్పిస్తున్నారు.
తానా పాఠశాల ఛైర్ నాగరాజు నలజుల మాట్లాడుతూ విద్యార్థులు తెలుగును ఆడుతూ పాడుతూ చదవాలనే ఆకాంక్షను రేకెత్తించడమే పాఠశాల ప్రదాన ఉద్దేశ్యమని అన్నారు. కరికులం డైరక్టర్ డా. గీతామాధవితో పాటూ పాఠశాల ఉపాధ్యాయులైన పద్మా శొంఠి, శ్రీదేవి ఎర్నేని, సరస్వతి వరకూరు, రవి పోచిరాజు, సత్యా బుర్రా, శ్రీకాంత్ దాశరథి, వెంకట్ కొర్రపాటి మొదలైన వారి సేవలు గణనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమ సమన్వయకర్తలుగా డా.గీతామాధవి, కృష్ణ, రజని, పాఠశాల బే ఏరియా డైరక్టర్లు ప్రసాద్ మంగిన, రమేష్ కొండా వ్యవహరించారు.
తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు, కార్యదర్శ రవి పొట్లూరి, తానా కోశాధికారి రవి వేమూరి, కల్చరల్ కో ఆర్డినేటర్ సునీల్ పాంత్రాతో పాటు తానా రీజీనల్ కో ఆర్డినేటర్లు తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.













