డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై జర్మనీ ఫైర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కి నిధులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై జర్మనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా సంభోభంపై ఇతరులను నిందించవద్దంటూ జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్ హెచ్చరించారు. ఇతరులను నిందించి ప్రయోజనం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యుత్తమ పెట్టుబడి ఏదైనా ఉంటే అది ఐక్యరాజ్య సమితి బలోపేతం చేయడమే. అన్నిటి కంటే మించి కోవిడ్ 19 పై పరిశోధనలు నిర్వహించడం, వ్యాక్సీన్ల తయారీ, పంపిణీ తదితర అంశాల కోసం ఆర్థికంగా సతమతమవుతున్న డబ్ల్యూహెచ్వోను ఆదుకోవాలి అని మాస్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్వో తీవ్ర బాధ్యతా రాహిత్యానికి పాల్పడిందంటూ ట్రంప్ ఆరోపించిన నేపథ్యంలోనే మాస్ ఈ మేరకు స్పందించడం గమనార్హం.













