చైనా నుంచి వచ్చే కంపెనీలకు స్వాగతం
చైనాకు బదులు భారత్ను తమ పెట్టుబడులకు కేంద్రంగా చేసుకోవాలనుకునే కంపెనీలను స్వాగతిస్తామని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. అలాంటి కంపెనీలను ఆకర్షించేందుకు త్వరలోనే కార్యాచరణ పథకం రూపొందిస్తామన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికాలో ఉన్న సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాలోని అనేక బహుళ జాతి కంపెనీ (ఎంఎన్సీ)లు ముఖ్యంగా అమెరికా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను భారత్ వంటి దేశాలకు తరలించాలని యోచిస్తున్నాయి. వియత్నాం ఇప్పటికే ఇందులో కొన్ని ఎంఎన్సీలను ఆకర్షించింది. అయితే ఆ కంపెనీల విస్తరణకు అవసరమైన సుశిక్షితులైన మానవ వనరులు వియత్నాంలో దొరకడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ ప్రకటన చేయడం విశేషం. ముందు ఒక కార్యాచరణ పథకం రూపొందిస్తాం. దాని ఆధారంగా పెట్టుబడులకు భారత్ ఎంత ఆకర్షణీయమైన దేశమో ఆ కంపెనీలకు వివరిస్తాం అని చెప్పారు.













