ఆచూకీ చెబితె.. ఎఫ్బీఐ భారీ రివార్డు
అమెరికాలో ఒక భారతీయ వ్యక్తిని కిడ్నాప్ చేసిన హత్య చేసిన కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం అందించిన వారికి భారీ రివార్డును ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రకటించింది. ఈ కేసును ఎఫ్బీఐ సెంట్రల్ వర్జీనియా హింసాత్మక నేరాల టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నేరస్థుడి ఆచూకీని కనుక్కునేందుకు తాజా ప్రకటన చేసింది. ఈ హత్యకు సంబంధించిన ఏదైన సమచారం ఇచ్చిన వారికి 15,000 డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నామని ఎఫ్బీఐ ప్రకటించింది.
ఎఫ్బీఐ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 16, 2012న అమెరికాలో ఉంటున్న భారత జాతీయుడు పరేష్కుమార్ పటేల్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. వర్జీనియాలోని చెస్టర్ ఫీల్డ్లో పనిచేస్తున్న పటేల్ను ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం ఎత్తుకెళ్లారు. నాలుగు రోజుల తరువాత తుపాకీ గుళ్ల గాయాలతో ఉన్న అతని మృతదేహాన్ని వర్జీనియా రిచమండ్ నగరంలోని అంకారో బోట్ ల్యాండింగ్ వద్ద పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించిన నిందితుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో చాలెంజింగ్గా తీసుకున్న దర్యాప్తు సంస్థ ఈ అవార్డును ప్రకటించింది.













