ఈ ఎన్నికల వల్ల దేశంలో అశాంతి, అలజడి : ఫేస్బుక్ సీఈవో
నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల వల్ల దేశంలో అశాంతి, అలజడి చెలరేగే ప్రమాదం ఉందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ అన్నారు. అయితే ఆ ప్రమాదాలను నివారించేందుకు సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మూడవ క్వార్టర్ లాభాలపై జరిగిన చర్చల్లో మాట్లాడుతూ జుకర్బర్గ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అనేక అంశాలపై విభజన ఉన్నదని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేందుకు వారాల పాటు సమయం పడుతోందని, దీని వల్ల దేశంలో అశాంతి చెలరేగే అవకాశాలు ఉన్నట్లు జుకర్బర్గ్ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ కంపెనీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఓటు రిజిస్ట్రేషన్ కోసం, ఎన్నికలపై కచ్చితమైన సమచారం ఇవ్వడం కోసం యూజర్లకు అవకాశాలు కల్పించినట్లు జుకర్బర్గ్ తెలిపారు. ఎన్నికలకు వారం ముందు రోజులు రాజకీయ ప్రకటనలను బ్యాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే యాడ్స్ను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మకంగా మారే కాంటెంట్ను కూడా నిషేధిస్తున్నట్లు జుకర్బర్గ్ చెప్పారు. ఇది తమ విధాన నిర్ణయాల్లో మార్పు కాదు అని, కానీ ఎన్నికల వేళ హింస, అలజడిని తగ్గించేందుకు తాము చేస్తున్న ప్రయత్నమని జుకర్బర్గ్ అన్నారు. ఇటీవల అమెరికాలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాల్మార్ట్ లాంటి సంస్థ కూడా తమ స్టోర్స్ నుంచి అమ్మకానికి ఉన్న ఆయుధాలను తొలగించింది.













