28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక సమావేశంలో వెంకయ్య నాయుడు
28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో.. భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారితో ఆత్మీయ సమావేశం జరిగింది.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం వారి సహకారంతో వందలాది మంది భారతీయుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు.
భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం పరిపూర్ణ నిర్వచనమని, ఎన్నోదశాబ్దాల నుండి, ప్రజాస్వామ్యయుతంగా అందరూ కలిసి మెలిసి ఐక్యతతో, ప్రగతి శీల దేశాభ్యుదయానికి చేయూతనందించటమే భారతీయతకు నిర్వచనమని ఆయన తెలిపారు. దేశ భద్రత, జాతీయభావాలతో ప్రజలంతా నడుచుకోవాలని, దేశం కానీ దేశంలో వృత్తి రీత్యా కస్టపడి, పురోగతి సాధించాలని, కస్టపడి సాధించి, పెంచి, నలుగురితో పంచుకోవటమే మన సాంప్రదాయమన్నారు.
మాతృభాష, మాతృభూమి, మాతృ దేశాన్ని మించిన ఆస్తి, అస్తిత్వం లేవన్నారు. అమ్మ భాషలోని కమ్మ దనాన్ని, మనవైన సంస్కృతీ, సంప్రదాయాలను రాబోయే తరాలకు సైతం అందించాలని, మన కట్టు, బొట్టు, బాష, యాస వదులుకోవాల్సి అవసరం లేదని. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటూ, మానవీయ విలువలను కాపాడుకుంటూ ..సామాజిక బాధ్యతతో నడచుకోవటమే సనాతన జీవన విధానమని.. ఆ ధర్మాన్నే, అందరూ పాటించాలని కోరారు.
తానా మాజీ అధక్షులు సతీష్ వేమన,ప్రసాద్ అడపా, కృష్ణ లామ్, సునీల్ సింగ్, కృప సింగ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యాష్ బొద్దులూరి, భాను మాగులూరి, రవి అడుసుమిల్లి, సుధీర్ కొమ్మి, శ్రీనివాస్ గంగా, సుధా పాలడుగు, శ్రీవిద్య మరియు పలు సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.













