ఇరు దేశాలు కోరితేనే మధ్యవర్తిత్వం : అమెరికా
కశ్మీర్ పై మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని అమెరికా మరోసారి తెలిపింది. అయితే, ఇందుకోసం భారత్, పాకిస్థాన్ కోరితేనే తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తారని సృష్టం చేసింది. అమెరికా ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ అంశంలో ఇతరుల జోక్యాన్ని భారత్ కోరుకోవడం లేదని అన్నారు. భారత్, పాక్ మధ్య చర్చలు జరగడానికి కావాల్సిన వాతావరణం కోసం తమ దేశం కృషి చేస్తుందన్నారు. చర్చలకు అడ్డంకిగా ఉన్న ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని, భారత్ తో చర్చలకు కావాల్సిన వాతావరణాన్ని నెలకొల్పాలని ఆయన అన్నారు.
ఇటీవల కర్తార్పూర్ నడవాపై జరిగిన ఒప్పందం స్వాగతించదగిన పరిణామమని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు అమెరికా సహకరిస్తుందన్నారు. తమ దేశాధ్యక్షుడు ట్రంప్ దేశాల ప్రధానులతో ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపారని తెలిపారు.













