తానా చేయూత ద్వారా కర్నూలు విద్యార్థులకు స్కాలర్ షిప్ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ”చేయూత” ప్రోగ్రాం ద్వారా కర్నూలు కి చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. హైదరాబాద్ మాదాపూర్ లో జరిగిన కార్యక్రమంలో కర్నూలు కు చెందిన శ్రీకిరణ్, విశ్వనాథ్, తేజస్విని, జగన్ మోహన్, తేజశ్రీ, నందిని, శివాంశ్ లకు లక్ష ఎనభై వేల రూపాయల స్కాలర్షిప్లను తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్ అందజేశారు. కరోనా వైరస్ వలన ప్రతిభాపాటవాలు కలిగిన చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారికోసం తానా ఫౌండేషన్ కోశాధికారి శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో చేపడుతున్న ‘చేయూత’ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వెయ్యి (1000) మందికి పైగా విద్యార్థులకు పారితోషికాలు అందించామని తానా మాజీ అధ్యక్షులు నాదెళ్ల గంగాధర్ తెలిపారు.
ఫిలడెల్ఫియా తానా యూత్ విభాగం, తానా కార్యదర్శి పొట్లూరి రవి ఈ కార్యక్రమానికి సహకరించారని తానా ఫౌండేషన్ కోశాధికారి శశికాంత్ వల్లేపల్లి తెలిపారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో మాదాపూర్ క్యూ హబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసాద్ గారపాటి, ముప్పా రాజశేఖర్, గోపి వాగ్వాల, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.













