ప్రకాశం జిల్లాలో ముమ్మరంగా డిజిటల్ తరగతుల ఏర్పాటు
ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతుల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి చొరవతో ఎన్నారైలు ఇచ్చిన విరాళాలతో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. కందుకూరు మండలంలోని మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ తరగతులను ప్రారంభిస్తున్నారు.
ఎన్నారై పుట్టాకిషోర్ బాబు ఈ డిజిటల్ తరగతుల ఏర్పాటుకు విరాళాన్ని ఇచ్చారు. జరుగుమల్లి మండలంలోని ఇలవర జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు. ఎన్నారై సుబ్బారావు కారసాల విరాళంతో ఇక్కడ తరగతులు ప్రారంభమవుతున్నాయి. పోతవరం ఉన్నత పాఠశాలలో కూడా డిజిటల్ తరగతుల నిర్వహిస్తున్నారు. అద్దంకిలోని శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కూడా డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు. కారుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది నుంచి డిజిటల్ తరగతులను ప్రారంభిస్తున్నారు. ఎన్నారై రమణ మన్నం ఇచ్చిన విరాళాలతో ఈ తరగతులు ఏర్పాటయ్యాయి. మర్లపాడు ఉన్నత పాఠశాలలో కూడా డిజిటల్ తరగతులను ప్రారంభిస్తున్నారు. వీర్ నల్లమోతు, భరత్ మద్దినేని, వజ్జ శ్రీ హరీష్, వెంకట్ మద్ది, కొప్పోలు లక్ష్మీ ప్రభాకర్, చెన్నుపాటి క్రాంతి కుమార్, మన్నం రమణ తదితరులు కూడా జిల్లాలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముందుకు వచ్చారు.
ఇలా జిల్లాలో పలు ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులను ముమ్మరంగా ఏర్పాటు చేసినట్లు ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పాఠశాలలో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటులో విద్యార్థులను కూడా భాగస్వాములయ్యేలా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.













