అమెరికాలో ఘనంగా దీపావళి సంబరాలు

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దీపావళి పండుగ అద్దం పడుతుందని గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. గుంటూరు ఎన్నారై అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస రావు కొమ్మినేని అద్వర్యం లో అమెరికాలోని ప్రవాసాంధ్రులు దీపావళి పర్వదినాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. డల్లాస్ లోని ప్రవాసాంధ్రులు సాంప్రదాయ దుస్తుల్లో కలుసుకొని దీపాలు వెలిగించి, బాణాసంచాలు కాల్చి దీపావళిని వేడుకగా జరుపుకొన్నారు.
ఈసందర్భంగా మన్నవ మాట్లాడుతూ హిందువుల ప్రముఖ పండుగల్లో దీపావళి ఒకటి, చిమ్మ చీకట్లను కురిపించే అమావాస్యరాత్రిని విందారబోసినట్లు అనిపించే వెన్నెల వెలుతురులో నింపేసే పండుగ దీపావళి. కులమతాలు వయోబేధాలు లేకుండా పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకొనే పండుగ. చెడును రూపుమాపి, మంచిని మిగిల్చిన సందర్భంగా, సంతోష చిహ్నంగా చీకటిని పారద్రోలుతూ దీపాలను వెలిగించి, విజయ సూచికంగా టపాసులు కాల్చుకొనే ఆచారం ఎంతో విశిష్టమైనదన్నారు. తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేసారు.
శ్రీనివాస రావు కొమ్మినేని మాట్లాడుతూ అన్యాయాలపై, అక్రమాలపై విజయాన్ని సాధించిన రోజు … మనిషిలోని ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్ధం, అధర్మం, అవినీతి అనేవి చీకటి సంకేతం. ప్రేమ, మంచితనం, సత్ప్రవర్తన, ధర్మం అనేవి మంచితనానికి సంకేతం. చీకటిని పారద్రోలి జ్ఞాన వెలుగును అనుగ్రహించి జీవితానికి చైతన్య దీప్తినిచ్చే పండుగ దీపావళి అన్నారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వంటల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని వివిధరకాల తెలుగు వంటకాలు వండారు. తదనంతరం జరిగిన కార్యక్రమం లో ఉత్తమ వంటకాలను వండినవారికి గుంటూరు ఎన్నారై అసోసియేషన్ తరుపున బహుమతులను అందచేశారు.
ఈ కార్యక్రమం లో శ్రీనివాస రావు కొమ్మినేని, క్రాంతి లత, పుల్లారావు మందడపు, శ్రీదేవి, వెంకట శివరావమ్మ, విష్ణు, విద్య, రిషిక్, శ్రిత, యోగేష్, మానస, పల్లపోతు, అనిల్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.











































































