నిఘా వర్గాలు హెచ్చరించినా ట్రంప్ పట్టించుకోలేదు
అమెరికాలో కరోనా విజృంభనకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒంటెత్తు పోకడలే కారణమని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. వైరస్ గురించి ఇంటెలిజెన్స్, జాతీయ దర్యాప్తు సంస్థ, ఆరోగ్య శాఖ అధికారులు పలుమార్లు హెచ్చరించినా ట్రంప్ పెడచెవినపెట్టారని వెల్లడించింది. వైరస్ తీవ్రత గురించి ప్రజలకు తెలియజేయడంలో, దీని వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. కరోనా చాలా ప్రమాదకరమైనది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే (జనవరి ప్రారంభంలో) మనం అప్రమత్తం కావాలి. ప్రజలనూ అప్రమత్తం చేయాలి అని నిఘా వర్గాలు, ఉన్నతాధికారులు హెచ్చరించినా ట్రంప్ పట్టించుకోలేదని వెల్లడించింది.













