చికాగోలో ఆటా భవన్…బోర్డ్ సమావేశంలో నిర్ణయం
అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా, అట్లాంటా నగరంలో సెప్టెంబర్ 24వ తేదీన ఆటా కార్యవర్గ సమావేశం నిర్వహించింది. పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, మెంబెర్స్, స్టాండింగ్ కమిటీస్, రీజినల్ కోఆర్డినేటర్స్ పాలుపంచుకున్న ఈ సమావేశంలో కీలకమైన విషయాలను చర్చించారు. ఆటా కార్యవర్గ ప్రతినిధులు చికాగోలో ఆటా భవన్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించడానికి ఆటా బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రారంభోపన్యాసం చేస్తూ తనపై కార్యవర్గం ఉంచిన ఈ గురుతర బాధ్యతకు సదా కృతన్యుడినని, తన ఆధ్వర్యంలో ఆటాలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ఆటా చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా 15000 మందితో వాషింగ్టన్ డీసీ లో మహా సభలు నిర్వహించటం తన అదృష్టంగా భావిస్తున్నానని, తోడ్పాటు అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి ట్రెజరర్ రిపోర్ట్ను బోర్డుకి సమర్పించారు, కాన్ఫరెన్స్ సమయంలో ఎంతో సమర్ధవంతంగా కోశాధికారి బాధ్యతలు నిర్వహించినందులకు వారి సేవలను ఆటా బోర్డు కొనియాడిరది. ఎన్నో కీలకమైన విషయాలు చర్చించిన ఈ సమావేశాన్ని సమర్ధవంతంగా నిర్వహించినందుకు సెక్రటరీ హరిప్రసాద్ రెడ్డి లింగాలను ఆటా కార్యవర్గం అభినందించింది.
ప్రతి రెండు సంవత్సరాలకి ఆటా ఎంపిక చేసే నూతన కార్యవర్గ ఎంపిక కోసం నామినేషన్ కమిటీ చైర్మన్ గా పరమేష్ భీంరెడ్డిని ఎంపిక చేసారు.
పరమేష్ మాట్లాడుతూ ఎంతో సమర్ధవంతంగా ఆటా ని ముందుండి నడిపించినందుకు ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ ని అభినందించారు. మొదటి సారి వినూత్న పద్దతిలో బాలట్ ద్వారా నామినేషన్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ ప్రాసెస్ మరియు ఉపయోగాలను జాయింట్ సెక్రటరీ రామకృష్ణ అల్లా వివరించారు. ఆటా ఎన్నికలు ఎలక్ట్రానిక్ బాలట్ ద్వారా నిర్వహించటానికి సభ ఆమోద ముద్ర వేసింది. ఎలక్షన్ కమిటీ చైర్ గా జాయింట్ ట్రెజరర్ విజయ్ కుందూరు వ్యవహరిస్తారు. ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించారు.
ఆటా 17 వ కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కో-కన్వీనర్ కిరణ్ పాశం కోర్ కమిటీ, ఆడ్-హాక్, కాన్ఫరెన్స్ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియ చేసారు. ఆటా కాన్ఫరెన్స్ అడ్వయిజరీ కమిటీ చైర్ జయ్ చల్ల ఇంత పెద్ద ఎత్తున ఆటా మహాసభలు నిర్వహించటం ద్వారా ఆటా బ్రాండ్ వేల్యూ రెట్టింపు అవ్వటం ఆనందాయకం అని తెలిపారు.
ఆటా అడ్వయిజరీ కమిటీ చైర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, అట్లాంటాలో బోర్డ్ సమావేశం ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియచేసారు. ఆటా ఆఫీస్ చికాగోలో నెలకొల్పటంపై స్పందిస్తూ, తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు బోర్డు సభ్యులను అభినందించారు. అట్లాంటా టీం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆటా పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, బోర్డ్ అఫ్ ట్రస్టీస్ అనిల్ బొదిరెడ్డి, వేణు పిసికే, ప్రశీల్ గూకంటి, కాన్ఫరెన్స్ కో-కోర్డినేటర్ కిరణ్ పాశం స్పాన్సర్లను ఘనంగా సత్కరించారు.
ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ నామినేషన్ ప్రాసెస్, ఎలక్ట్రానిక్ వోటింగ్ పద్దతి ద్వారా పటిష్టమైన నూతన కార్యవర్గం ఏర్పాటు అవుతుందని ఆకాంక్షించారు, మహిళలు విరివిగా సంస్థ కార్యకలాపాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆటా అట్లాంటా టీం ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చెయ్యటం తనకు ఎంతో ఆనందదాయకం అని కొనియాడారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమాలు, గాయనీ గాయకులు పాడిన పాటలు ఆహుతులను అలరించాయి.













