నెక్లెస్రోడ్లో ఉత్సాహంగా 5కే రన్
అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లు సంయుక్తంగా హైదరాబాద్లో 5కే రన్ నిర్వహించాయి. మహిళా సాధికారత, ఒత్తిడిని అధిగమించే అంశాలపై ప్రచారం చేస్తూ అమెరికా తెలుగు సంఘం, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ 5కే పరుగును మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ రన్లో ఎన్ఆర్ఐలతో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లిబర్టీ నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా జలవిహార్ వరకూ ఈ 5కే రన్ జరిగింది. యూఎస్ఏ, ఇతర ప్రాంతాలలో ఎన్ఆర్ఐ తెలుగు అసోసియేషన్లు అన్ని ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయడం లేదనే అపోహ ఉందని, అయితే ఈ కార్యక్రమం ద్వారా అది వాస్తవం కాదని నిరూపితమైందని ఎన్ఆర్ఐ ప్రతినిధులు అన్నారు. ఎన్ఆర్ఐ తెలుగు అసోసియేషన్లు అన్ని కలిసి 2018 డల్లాస్లో ఒక ఉమ్మడి సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.













