యాపిల్ కు కరోనా షాక్
ఈ జనవరి -మార్చి త్రైమాసికంలో తమ ఆదాయ లక్ష్యాలు నెరవేరకపోవచ్చని యాపిల్ అంటున్నది. కరోనా వైరస్ ఐఫోన్ సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తున్నదని తాజాగా పేర్కొన్నది. చైనాలో తమ భాగస్వామ్య సంస్థలున్నాయని, కరోనా కారణంగా వాటి తయారీ కేంద్రాలు మూతబడ్డాయని, ఈ పరిణామం ఐఫోన్ తయారీపై పడుతున్నదని వెల్లడించింది. ఇక ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా రవాణా వ్యవస్థ లోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే వరల్డ్ మొబైల్ కాంగ్రెస్, ఆటో షోలతో పాటు పలు క్రీడా సంరంభాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఒక దేశం నుంచి మరో దేశానికి కరోనా వ్యాప్తి చెందవచ్చన్న భయాలు వెంటాడుతున్నాయి మరి. ఐఫోన్ విక్రయాల్లో చైనా మార్కెట్ కూడా కీలకమవగా, వైరస్ దెబ్బకు అక్కడి అమ్మకాలు ఆటకెక్కాయి. ఇది కూడా సంస్థ ఆదాయ లక్ష్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.













