సెయింట్లూయిస్లో ఎపి జన్మభూమి కార్యక్రమం సక్సెస్
ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం అభివృద్ధిలో భాగంగా అమెరికాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్కు సెయింట్లూయిస్లో ఘనస్వాగతం లభించింది. ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు సౌకర్యాల కల్పనకు ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి మాట్లాడుతూ, ఎపి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు చాలా స్కూళ్లలో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశామని, మరిన్ని చోట్ల ఈ తరగతుల ఏర్పాటుకు ఎన్నారైలు సహకరించాలని కోరారు. జన్మభూమి లక్ష్యసాధనకు కృషి చేస్తున్న ఎపి జన్మభూమి కో ఆర్డినేటర్లు రాజా సూరపనేని, కిషోర్ ఎరపోతిన, కిషోర్ యార్లగడ్డను ఇతరులను మంత్రి గంటాతోపాటు, జయరామ్ కోమటి అభినందించారు. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన, గుంటూరు మాజీ జడ్పి చైర్మన్ పాతూరి నాగభూషణం తదితరులు కూడా పాల్గొన్నారు.













