AIA: ఎఐఎ ఆధ్వర్యంలో ఘనంగా ‘నారి’ మహిళా దినోత్సవ వేడుకలు
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ అసోసియేషన్(AIA), కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు తమ శక్తిని చాటి చెప్పి సేవలందిస్తూ అన్ని రంగాలలో రాణిస్తున్నందుకు గుర్తింపుగా ఈ వేడుకలను నిర్వహించారు. లింగ వివక్ష లేకుండా ఆడపిల్లలు, యువతులు, మహిళలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత అనే థీమ్ తో ఈ వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్ రెడ్డి (Dr. Srikhar Reddy) స్వాగతం పలికారు. భారతదేశం మహిళా అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. విభిన్న రంగాలలోని విశిష్టమైన మహిళలు తమ అద్భుతమైన విజయాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారి వారి రంగాలలో చేసిన విశేష కృషి, వారి రంగాలకు అందించిన అత్యుత్తమ సహకారాలతో మనందరికీ స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమానికి అటార్నీ జనరల్ రాబ్ బొంటాతోపాటు దాదాపు 180 మంది ప్రముఖులు హాజరయ్యారు. భారత కాన్సులేట్ SFO నుండి ప్రతిమా రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసెంబ్లీ సభ్యులు గెయిల్ పెల్లెరిన్, మియా బొంటా, రాష్ట్ర కోశాధికారి ఫియోనా మా, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులర్ కార్ప్స్, అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), భారతీయ డయాస్పోరా సభ్యులు కూడా హాజరయ్యారు.
ఈ వేడుకలను పురస్కరించుకుని అందమైన పండుగ రంగులతో సభా ప్రాంగణాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమం కోసం చేసిన అత్యద్భుతమైన ఏర్పాట్లు చూసి అతిథులు ఆశ్చర్యపోయారు. వివిధ రంగాల్లో రాణించి ఘనవిజయాలు సాధించిన 40 మందికి పైగా మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వారితో పాటు ప్యానెల్ స్పీకర్లు తమ జీవిత ప్రయాణం, అనుభవాలు, విజయాల గురించి ప్రసంగించారు.
సవాళ్లు, ఒత్తిళ్లు, అడ్డంకులను ఎలా అధిగమించాలో మహిళలకు సందేశమిచ్చి స్ఫూర్తి నింపారు.
ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శివ నూపురం స్కూల్, సింధు సురేంద్ర విద్యార్థులు కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ తో అలరించారు. ఎఐఎ, బాటా బృంద సభ్యులు ఫ్యాషన్ షో నిర్వహించారు. విజయ, కుకు, దీపా, జయ, శ్రీలు, శ్రీదేవి, శిరీషలతో కూడిన నిర్వాహక బృందానికి ఇందు, యామిని, అనూజ, భార్గవి, మానసలు తమ సహకారం అందించారు. వీరంతా కలిసి ఈ కార్యక్రమాన్ని అద్భుత్వంగా నిర్వహించి అతిథుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి బృంద సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట మహిళలతో పాటు ఈ కార్యక్రమం నామినేషన్లు, ప్రమోషన్లలలో పాల్గొని లాజిస్టిక్స్ లో సహకరించి ఈ ఈవెంట్ విజయవంతం చేసిన పురుషులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్ స్పాన్సర్ ఆజాద్ ఆరమండ్లకు.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, ఆహూతులకు, నిర్వాహకులకు పసందైన విందు భోజనం ఏర్పాటు చేసిన నమ్మ రెస్టారెంట్ (మిల్పిటాస్) కు, ఈ ఈవెంట్ డెకరేషన్ బాధ్యతలు భుజాన వేసుకున్న సీసీ డెకార్స్కు ఎఐఎ, బాటా టీమ్కు అందరూ ధన్యవాదాలు తెలిపారు.
అవార్డు గ్రహీతల వివరాలు…
ది ల్యూమినరీ అవార్డు – ప్రతిమా రెడ్డి
లైఫ్ టైం అచీవ్ మెంట్ – ఫియోనా మా
లైఫ్ టైం అచీవ్ మెంట్ – తలత్ హసన్
లైఫ్ టైం అచీవ్ మెంట్ – పద్మశ్రీ వారియర్
స్పీకర్ అండ్ ట్రయల్ బ్లేజర్ – మియా బోంతా
స్పీకర్ అండ్ ట్రయల్ బ్లేజర్ – జోడి షెల్టన్
స్పీకర్ ్ అండ్ ట్రయల్ బ్లేజర్ – విశాఖ ఆర్ ఎం
స్పీకర్ ్ అండ్ ట్రయల్ బ్లేజర్ – రంజితా చక్రవర్తి
స్పీకర్ ్ అండ్ ట్రయల్ బ్లేజర్ – హర్షా రామ్ చందానీ
స్పీకర్ ్ అండ్ ట్రయల్ బ్లేజర్ – జయంతి పిల్లుట్ల
ట్రయల్ బ్లేజర్ – గెయిల్ పెల్లెరిన్
ట్రయల్ బ్లేజర్ – లిల్లీ మియ్
ట్రయల్ బ్లేజర్ – అనురాధా జగదీష్
ట్రయల్ బ్లేజర్ – అను చీరాల
ట్రయల్ బ్లేజర్ – ఆయేషా థాపర్
సీఏ గీతా రామకృష్ణన్ మెమోరియల్ అవార్డ్ – మధు రంగనాథన్కు ఇచ్చారు.







