డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డికి ఆపి స్పెషల్ సర్వీస్ అవార్డు
టెక్సస్లోని శాన్ అంటోనియో నగరంలో జూన్ 23 నుంచి 26 వరకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఆపి) 40వ వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆపి అధ్యక్షులు డాక్టర్ అనుపమ గొటిముకుల తెలిపారు. ఈ సదస్సును భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నామని, అందుకోసం కోసం కన్వెన్షన్ చైర్ డాక్టర్ జయేష్ షా, సీఈవో అడివి వెంకీ కృషి చేస్తున్నారన్నారు.
భారతదేశంలో వైద్యవిద్యను అభ్యసించి ఉన్నత చదువులు, పరిశోధనల నిమిత్తం తొలినాళ్లలో అమెరికా వచ్చిన వాళ్లు అనేక రకాలైన వివక్షలకు గురయ్యారన్నారని తెలిపారు. మొక్కవోని ధైర్యంతో ఆ కష్టాలను అధిగమించి గౌరవంగా అమెరికా రాష్ట్రాల్లో నిలబడటానికి వైద్యులంతా కలిసి 1980 కాలంలో ఏర్పాటు చేసుకున్నదే ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) అని అనుపమ గొటిముకుల తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఫిజీషియన్స్ ప్రధానంగా ఎదుర్కుంటున్న మెడికేర్ పేమెంట్ కట్స్చి, ఇమ్మిగ్రేషన్ అంశాలలో ప్రధానమైన గ్రీన్ కార్డ్ బ్లాకేజ్ గురించి అమెరికాలోని చట్టసభల ప్రతినిధులతో ఆపి తరఫున చర్చించడం జరిగిందని ఆమె తెలిపారు. ఆపి సంస్థకు భారతదేశంలో అత్యున్నతమైన సేవల్ని అందిస్తున్నందుకు ప్రముఖ వైద్యనిపుణులు, అపి ఓవర్సీస్ కో ఆర్డినేటర్ డాక్టర్ దువ్వూరు ద్వారకానాథరెడ్డి కి స్పెషల్ సర్వీస్ అవార్డును అందించి శాన్ అంటోనియో వేదిక మీద ఘనంగా సత్కరిస్తున్నామని అధ్యక్షురాలు అనుపమ గొటిముకుల వెల్లడించారు.
అలాగే ఈ సదస్సులో విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారిని కూడా ఆహ్వానించి సత్కరిస్తున్నామని అనుపమ వెల్లడించారు. సత్కారం అందుకునే వారిలో సునీల్ గవాస్కర్ (క్రికెటర్), డాక్టర్ రాహుల్ గుప్త (డైరెక్టర్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ), డాక్టర్ సౌజన్య మోహన్ (టెక్సస్ గ్రూప్), ప్రైమ్ హెల్త్ కేర్ సిఇఓ డాక్టర్ ప్రేమ్ కుమార్ రెడ్డి, సైంటిస్ట్ పీటర్ జె హెటెజ్, సాధ్వి భగవతి సరస్వతి, అష్టాంగయోగ పరమగురు శరత్ జాయిన్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జాక్ రెస్నెక్ జూనియర్ లు ఉన్నారు.













