ట్రంప్ ను కోర్టుకీడ్చిన 16 రాష్ట్రాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆ దేశానికి చెందిన 16 రాష్ట్రాలు కోర్టుకీడ్చాయి. మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మాణం కోసం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్పై ఆ రాష్ట్రాలు కోర్టులో దావా వేశాయి. కాలిఫోర్నియా రాష్ట్రం ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్నది. వాల్ ప్రాజెక్టు కోసం ట్రంప్ అక్రమ పద్ధతిలో నిధులు సేకరిస్తున్నారని ఆయా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ట్రంప్ చర్యను ఖండిస్తూ డెమోక్రాట్లు కూడా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్ష అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేస్తున్నారని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గ్జేవియర్ బెసిరా తెలిపారు. చట్టబద్దంగా పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు ఖర్చు చేయాలని, కానీ ట్రంప్ వాటిని గోడ నిర్మాణం కోసం వాడడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాలిఫోర్నియా అటార్నీ తెలిపారు. 16 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించడంతో ట్రంప్ తన ఎమర్జెన్సీ ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో ఈ కేసు వాదనలు జరగనున్నాయి.
గత వారం వైట్హౌజ్లో ఎమర్జెన్సీ ప్రకటన చేశారు. ఎమర్జెన్సీ ప్రకటించడం ద్వారా గోడ నిర్మాణం కోసం 8 బిలియన్ల డాలర్లు వస్తాయన్నారు. వాస్తవానికి 3200 కిలోమీటర్ల పొడుగు ఉన్న బోర్డర్కు ఈ అమౌంట్ తక్కువే. గోడ నిర్మాణం కోసం 23 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. ఎమర్జెన్సీ ప్రకటన చేస్తే.. కొందరు సుప్రీంకోర్టుకు వెళ్తారని ట్రంప్ ముందే వెల్లడించారు కూడా. దేశంలో సంక్షోభం ఉన్నప్పుడు ఎమర్జెన్నీ చట్టాలను వినియోగిస్తారు. అయితే అక్రమ వలసదారులతో దేశంలో సంక్షోభం ఏర్పడిందని, అందుకే ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ట్రంప్ తెలిపారు. ఎమర్జెన్సీ చట్టం ప్రకారం.. మిలటరీ, డిజాస్టర్ నిధులను గోడ నిర్మాణం కోసం ట్రంప్ వాడాలనుకుంటున్నారు.













