హేయ్ మనిషి! నీ వికృత చేష్టలు మానుకో… !
కేరళలో గర్భం దాల్చిన ఏనుగు మృతిపై యావత్ భారతావని స్పందించింది. మనుషులను నమ్మి మోసపోయి ప్రాణాలను కోల్పోయిన ఏనుగుపై మానవాళి దిగ్భ్రాంతిని వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు మృతిపై సామాన్య జనంతో పాటు సెలబ్రిటీస్ కూడా ఆవేదన చెందారు. ఈ దుర్ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అందరూ కోరారు. తాజాగా సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తీవ్ర ఆవేదకు లోనయ్యారు. అసలు ఏం జరిగిందంటే..
‘గర్భం దాల్చిన ఏనుగు ఆహారం కోసం గ్రామంలోకి రావడంతో కొందరు ఆకతాయిలు దీపావళి బాంబు టపాసులు అమర్చిన పైనాపిల్ను దానికి ఇచ్చారు. మూగ జీవికేం తెలుసు తింటూ ఉండగానే అది పేలిపోవడంతో నోటికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు తట్టుకోలేక దగ్గర్లోని నదిలోకి వెళ్లింది. అలా అక్కడే ఆ ఏనుగు మృతి చెందింది. లోకాన్ని చూడని ఆ చిట్టి ఏనుగు కూడా గర్భంలోనే అంతమైంది.’
ఏనుగు మృతిపై రాములమ్మ స్పందిస్తూ.. ‘ఈ సృష్టిలో గొప్ప జీవి మనిషేనని గర్వంగా చెబుతారు. కానీ, దేవుడికి తన సృష్టిపై తనకే అసహ్యం వేసేలా ప్రవర్తిస్తున్నారు మనుషులు. ఈ ప్రకృతిపై మనిషికి మాత్రమే ఆధిపత్యం ఉన్నట్టు, మిగిలిన జీవాల మనుగడ మనిషి దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నట్టు కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో నా గుండెలు రగులుతున్నాయి. కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు బాణాసంచా మందు కూరిన అనాసపండు పెట్టి, ఆ మూగజీవి మరణవేదనను క్రూరంగా వినోదించిన ఈ మనుషుల వికృతచేష్టలకు ఏ శిక్ష సరిపోతుంది? ఇదే కాదు, టిక్టాక్ వీడియో కోసం ఓ కుక్కపిల్ల కాళ్ళూచేతులు కట్టేసి మురికి కాలువలోకి విసిరి ప్రాణాలు తీసిన ఘోరాన్ని చూశాను. అంతకుముందు ఒక వ్యక్తి మేడపై నుంచి కుక్కను దారుణంగా విసిరేశాడు. మూగజీవాలపై ఇలా ఎన్నెన్నో అకృత్యాలు… అసలేం జరుగుతోంది? ఇతర జీవులకు భూమ్మీద బతికే హక్కు లేదా? నేడు మన ప్రపంచం అనుభవిస్తున్న ఈ రోగాలు… దిగజారిన పరిస్థితులు… చూస్తుంటే…
మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం.. మనిషి చేసే తప్పులకు ఆ ప్రకృతి విధిస్తున్న శిక్షలే ఇవన్నీ అనిపిస్తోంది. తప్పు చేసినవారే కాదు… చూస్తూ స్పందించనివారు… అడ్డుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ పని చెయ్యనివారు కూడా శిక్షార్హులే. అందుకే ఇకనైనా మారదాం… నిండైన మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం. ఈ సృష్టిలో ప్రాణమున్న ప్రతీ జీవికి ఈ భూమి పై జీవించే హక్కు వుంది. మనల్ని సృటించిన ఆ భగవంతుడి దృష్టిలో మనం కృతఘ్నులం కావద్దు.’ మీ విజయశాంతి’ అని పేర్కొంది.













