అతిలోక సుందరికి అరుదైన గౌరవం…
శ్రీదేవి గొప్ప అందగత్తె. అంతకు మించిన గొప్ప నటి. సౌతిండియా నుంచి నార్తిండియా వరకూ తన ప్రతిభతో లేడీ సూపర్స్టార్ అయ్యారు. ఓ బ్రాండ్లా ఎదిగారు. అనూహ్యంగా గత ఏడాది శ్రీదేవి మరణించారు. అందరి మనసుల్లో చెరిగిపోని బొమ్మగా నిలిచిపోయారు. ఇప్పుడు సింగపూర్లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో అందమైన మైనపు బొమ్మగా మారారు శ్రీదేవి. ఈ మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీదేవి మరణించిన తర్వాత కూడా ఆమె మీద కురిపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుంది. నా భార్యగా తనని ఎంతగా ప్రేమించానో, తన ఆర్ట్ని, తనకు సినిమా మీద ఉన్న ప్రేమను అంతే గౌరవించాను. ఈ విగ్రహం తన ఆనవాళ్లకు ఓ చిహ్నంలా ఉంటుందనుకుంటున్నాను అన్నారు బోనీ కపూర్. మిస్టర్ ఇండియా సినిమా లోని హవా హవాయి.. పాటలో శ్రీదేవి లుక్ ఆధారంగా ఈ మైనపు బొమ్మను తయారు చేశారు.













