శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ అవార్డు
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మక ఏఎన్నార్ నేషనల్ అవార్డుకు నటి శ్రీదేవి, నటి రేఖలు ఎంపికయ్యారు. 2018వ ఏడాదికి గాను శ్రీదేవికి, 2019 ఏడాదికిగాను రేఖకు అవార్డు ప్రకటించారు. ఒక వ్యక్తి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందించే ఈ అవార్డు నవంబర్ 17న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అందచేస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎన్నార్ నేషనల్ అవార్డు చైర్మన్ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ నాగేశ్వరరావు గొప్ప నటన, వ్యక్తిత్వంతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన కోరిక ప్రకారమే తెలుగు అమ్మాయి అయిన రేఖకు, శ్రీదేవికి అవార్డు ప్రదానం చేస్తున్నట్టు చెప్పారు. ప్రతిష్ఠాత్మక అవార్డుగా దీన్ని కొనసాగించాలన్నది ఏఎన్నార్ కోరిక అని, ఆయన పేరున్నంతవరకు వార్డు కొనసాగిస్తామని హీరో నాగార్జున తెలిపారు. ఎంపికైనవారికి చిరంజీవి అవార్డులు ప్రదానం చేస్తారన్నారు.













