సింగర్ సునీత భావోద్వేగపూరిత పోస్ట్
తన రెండో పెళ్లిపై సింగర్ సునీత స్పష్టత ఇచ్చారు. రామ్ వీరపనేనితో తాను నిశ్చతార్థం చేసుకున్నట్లు ఆమె సోమవారం సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె స్నేహితుడు, వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సోమవారం నిశ్చితార్థం జరిగినట్లు ఆమె ప్రకటించారు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు అండగా నిలిచిన పిల్లలకు, తల్లిదండ్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.
‘ప్రతి తల్లిలాగే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, బాగా స్థిరపరచాలని కలలు కంటున్నాను. అదేవిధంగా నా పిల్లలు కూడా నేను నా జీవితంలో స్ధిరపరచాలని కోరుకున్నారు. అలాంటి అద్భుతమైన పిల్లల్ని కన్నందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. చివరికి వాళ్లు కోరుకున్న క్షణం వచ్చింది. నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్ జీవిత భాగస్వామిగా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాం. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఎప్పటిలాగే నన్ను ఆదరించి, మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను’.. అంటూ సునీత ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.













