లెజెండరీ డైరెక్టర్ సింగీతంకి కరోనా పాజిటివ్
అలనాటి మహా దర్శకుల వద్ద పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ – ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. ఎన్నో వైవిద్యమ్ గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు, కథకుడు కూడా. 88 సంవత్సరాల సింగీతం శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం ఫేస్బుక్ వీడియో ద్వారా అభిమానులకు తెలియజేశారు. కోవిడ్-19 లక్షణాలతో సెప్టెంబర్ 9న చెన్నైలో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. (సెప్టెంబర్ 22) మంగళవారం నాటితో ఆయన క్వారంటైన్ గడువు ముగుస్తుందని తెలిపారు.
అయితే అంతకు ముందు రోజే ఆయన పుట్టినరోజు కావడం విశేషం. తనకు కరోనా సోకిన విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. 65 ఏళ్లుగా నేను పాజిటివ్గా ఉన్నా, కానీ డాక్టర్లు ఇప్పుడు కొత్తగా కోవిడ్ పాజిటివ్ అన్నారంటూ సరదాగా మాట్లాడారు. హోమ్ ఐసోలేషన్లో భాగంగా ప్రత్యేక గదిలో ఉన్నానని, ఇది తనకు హాస్టల్ రోజులను గుర్తు చేస్తోందంటూ చమత్కరించారు. మాస్కులు పెట్టుకున్నా, భౌతిక దూరం పాటించినా, ఎన్ని జాగ్రత్తలు పడ్డా ఆ వైరస్ తనకు సోకిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కాగా సింగీతం శ్రీనివాసరావు పంతులమ్మ, అమెరికా అమ్మాయి , ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’, ‘ఆదిత్య369’ వంటి పలు హిట్ చిత్రాలకుదర్శకత్వం వహించారు. చివరగా 2005లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన” ముంబై ఎక్స్ప్రెస్” చిత్రానికి డైరెక్టర్గా పని చేశారు. ‘ఆదిత్య369’ సీక్వల్ గా నందమూరి బాలకృష్ణతో మరో సారి సరి కొత్త సైన్స్ ఫిక్షన్ కథతో మన ముందుకు రానున్నారు.













