Ram Charan: ప్రధాన మంత్రి మోదీని కలిసి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న రామ్ చరణ్, అనిల్ కామినేని & APL ప్రతినిధులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) చైర్మన్ అనిల్ కామినేని, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు విరేందర్ సచ్దేవా కలిసి ఈ రోజు న్యూఢిల్లీలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా, APL తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ప్రతినిధులు ప్రధాన మంత్రికి ఒక సింబాలిక్ బౌ ని అందజేశారు.
అనిల్ కామినేని నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ భారతీయ ప్రాచీన క్రీడ అయిన విలువిద్యను (Archery) తిరిగి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చే లక్ష్యంతో సాగుతోంది. ప్రపంచ స్థాయి శిక్షణ, పోటీ వేదికలు, అంతర్జాతీయ గుర్తింపు ..ఈ మూడు మార్గాల ద్వారా భారత విలువిద్యాకారులకు అవకాశాలను అందించడం APL ప్రధాన లక్ష్యం.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మన ప్రధాన మంత్రిని కలవడం ఎంతో గౌరవంగా అనిపించింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనుక ఉన్న విజన్ను పంచుకోవడం గర్వంగా ఉంది. విలువిద్య మన సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం. APL ద్వారా దీన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలన్నది మా ఆశయం. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది, ఈ వేదిక వాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.
ఈ భేటీకి రామ్ చరణ్తో పాటు ఆయన భార్య ఉపాసన కామినేని కొనిదెల కూడా హాజరయ్యారు. ఆమె రామ్ చరణ్ తల్లిదండ్రులు శ్రీ చిరంజీవి, శ్రీమతి సురేఖ తరఫున ప్రధాన మంత్రికి బాలాజీ విగ్రహం, సంప్రదాయ పూజా కిట్ ని బహూకరించారు.