మోదీ సంతోషంగా ఉన్నారా?
జస్ట్ ఆస్కింగ్ అంటూ విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ట్విటర్ వేదికగా రాజకీయ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పలు అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నిస్తున్న విధానం సంచలనం రేకెత్తిస్తోంది. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ సాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన ప్రకాశ్రాజ్ మళ్లీ కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రియమైన ప్రధానమంత్రిగారు విజయం సాధించినందుకు అభినందనలు. కానీ, ఈ ఫలితాలతో నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? 150 ప్లస్ సీట్లు సాధిస్తామన్నారు కదా ఏమైంది? ఒకసారి సింహావలోకనం చేసుకోండి. సమస్యలు ఎక్కడున్నాయో తెలుసుకోండి. విభజన రాజకీయాలు పనిచేయలేదు. గ్రామీణులను, పేదలను, రైతులను నిర్లక్ష్యం చేశారు. వారి గొంతు బిగ్గరగా వినిపిస్తోంది. మీరు వింటున్నారా అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.













