కత్తి మహేష్ కోలుకోవాలని మానవత్వం ప్రదర్శించిన పవన్ కళ్యాణ్ అభిమానులు

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో సినీ క్రిటిక్ కత్తి మహేష్ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కత్తి మహేష్ వ్యాఖ్యలపై ఎదురు దాడికి దిగుతూ ఆయనపై పవన్ ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపించడం చాలా సందర్భాల్లో చూశాం. అయినప్పటికీ పవన్ అభిమానులను రెచ్చగొట్టడం పనిగా పెట్టుకొని సంచలన కామెంట్స్ చేస్తూ వచ్చారు కత్తి మహేష్. అయితే అదే కత్తి మహేష్కి ఆక్సిడెంట్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ స్పందిస్తున్న తీరు చర్చల్లో నిలుస్తోంది. సాటి మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే ఆయన కోలుకోవాలని కోరుకోవడం సహజమే. అది శత్రువు అయినా ఆపద సమయంలో అన్నీ మరచి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని భావిస్తుంటారు జనం. ఒక రకంగా చెప్పాలంటే తాజాగా కత్తి మహేష్- పవన్ ఫ్యాన్స్ విషయంలో అదే జరుగుతోందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు చాలా దెబ్బలు తగలడంతో పాటు కన్ను మొత్తం పోయిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు మానవత్వంతో స్పందిస్తుండటం విశేషం. ఈ లోకంలో ఇంకా మానవత్వం మంటగలిసి పోలేదని తెలిసేలా.. తమకు బద్ద శత్రువైనప్పటికీ కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ”కత్తి మహేష్ గారు కోలుకోవాలని నా శ్రీరాముణ్ణి వేడుకుంటున్నాం. ప్రాణం ఎవరికైనా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారు మాకు ద్వేషించడం నేర్పలేదు. శత్రువుని అయినా క్షమించు అని నేర్పించారు” అని పేర్కొంటూ ట్వీట్స్ చేస్తున్నారు పవన్ అభిమానులు.ఇదిలా ఉంటే కొందరు మాత్రం కత్తి మహేష్ దిమ్మతిరిగిందన్నట్లుగా ట్వీట్స్ పెడుతుండటం హాట్ ఇష్యూ అయింది. ఇదే ప్రమాదంపై కొందరు దారుణంగా సెటైరికల్ కామెంట్స్ వదులుతున్నారు.