క్యూ లో నిలబడి జనంతో కలిసి…. సతీమణి వసుందర దేవి సమేతంగా ఓటు వేసిన బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 75 మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనున్నందున.. ఓట్ల శాతం మరింత పెరుగుతుంది. 60 నుంచి 70 శాతం మేర పోలింగ్ నమోదవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయవాడలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లా హిందూపురం టౌన్లో ఆయన ఓటు వేశారు. కొద్దిరోజులుగా ఆయన హిందూపురంలోనే ఉంటున్నారు. పార్టీ తరఫున మున్సిపాలిటీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి వార్డులోనూ పర్యటించారు. ఇంటింటికీ తిరిగారు.
టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.ఈ ఉదయం ఆయన భార్య వసుంధరతో కలిసి స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు చేరుకున్నారు. ఆ సమయంలో ఓటర్లు బారులు తీరి నిల్చుని కనిపించారు. దీనితో ఆయన వారితో పాటు క్యూ లైన్లో నిల్చున్నారు. పోలింగ్ సిబ్బంది, స్థానిక పోలీసులు.. ఆయనకు ఓటు వేసే అవకాశం కల్పించినప్పటికీ.. ప్రజలతో పాటు తానూ క్యూ లైన్లోనే ఉంటానని సున్నితంగా తిరస్కరించారు. తన వంతు వచ్చేంత వరకూ భార్యతో కలిసి క్యూలైన్లో నిల్చున్నారు. అనంతరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఙప్తి చేశారు..ఇక బాలయ్య సినిమా విషయానికొస్తే..బోయపాటి శీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు.. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాను మే 28 న విడుదల చేయనున్నారు.













