పద్మశ్రీ వచ్చిన ఆ రోజు చిత్ర పరిశ్రమ పండుగ చేసుకుంది

నేపధ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం 75వ పుట్టినరోజును ప్రపంచంలో వున్న ఆయన అభిమానులంతా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ తరం ఈతరం రేపటి తరం కూడా గర్వించే గొప్ప గాయకుడు, మానవతావాది బాలసుబ్రహ్మణ్యం. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. తెలుగు సినిమా రంగంలో ఇద్దరు లెజెండ్స్ ను పద్మ శ్రీ అవార్డు వరించింది. ఒకరు సంగీత ప్రపంచంలో చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మరొకరు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం జీవితమంతా తపనపడిన మహనీయుడు డి. వి.ఎస్ రాజు గారు.
సంగీతానికి బాలు గారి కంట్రిబ్యూషన్ అనూహ్యం అలాగే రాజు గారు చేసిన సేవ కూడా అపూర్వం. స్వర్గీయ ఎన్ .టి .రామారావు మార్గ దర్శకత్వంలో రాయలసీమ కరువు, పాకిస్తాన్ యుద్ధం, దివిసీమ తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు .. ఆపన్నులైన ప్రజల సహాయం కోసం రామారావు గారితో పాటు రాజుగారు వెన్నంటే ఉండి నిరంతరం శ్రమించారు . అంతేకాదు సినిమా రంగ ప్రగతి కోసం ఏర్పాటైన ట్రేడ్ బాడీ లకు దిశా నిర్దేశనం చేసింది రాజు గారే . గాంధీ సినిమా లాభాల్లో కొంత భాగం భారతీయ సినిమా కార్మికుల సంక్షేమ కోసం మూలానిధి ఏర్పాటు కోసం ఎన్.ఎఫ్.డి.సి చైర్మన్ గా రాజుగారు చేసిన కృషి అసమాన్యమైనది.
అందుకే ఈ ఇద్దరినీ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. 22 మార్చి 2001వ సంవత్సరం లో న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో అప్పటి రాష్ట్రపతి కె .ఆర్ నారాయణన్ బాలసుబ్రమణ్యం గారికి, డి.వి.ఎస్ రాజు గారికి పద్మశ్రీ అవార్డు ను ప్రదానం చేశారు. తెలుగు సినిమా గర్వించతగ్గ వ్యక్తులు రాజు గారు, బాలు గారు. ఈ ఇద్దరూ తెలుగు సినిమా వైభవానికి, ప్రాభవానికి కృషి చేసిన మహనీయులు. ఈ ఇద్దరి తో తనకున్న ఆత్మీయ అనుబంధం గురించి దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్ చెప్పిన అనుభవాలు.