గుంజన్ సక్సేనా పాత్రలో అతిలోక సుందరి కుమార్తె ?
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యి తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం కరణ్ జోహర్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తుంది జాన్వీ. తక్త్ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తన సరసన కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అప్పట్లో ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. గుంజన్ పాత్రలో జాన్వీ నటిస్తుందని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం జాన్వి ప్రత్యేకంగా గుంజన్ను కలిసింది. ఇటీవల పైలెట్ లుక్లో ఉన్న జాన్వీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. గతంలో మహిళా పైలట్ గుంజన్ 1999 కార్గిల్ యుద్దంలో గాయాల పాలైన చాలా మంది సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి వారిని రక్షించింది. అందుకు గానూ అందరిచేత ప్రశంసలు పొందింది. ఆమె ధైర్యానికి మెచ్చిన ప్రభుత్వం శౌర్యవీర్ అవార్డ్ కూడా అందించడం విశేషం.













