క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ మొబైల్ లో కీలక సమాచారం : సినీ తారలకు ఈ డి నోటీసులు
డ్రగ్స్ కానీయండి! కేసినో కానీయండి సంఘవ్యతిరేక కార్యకలాపాలకు సినీ తారలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. క్యాసినో చికోటి ప్రవీణ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ మొబైల్ నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అతడి వాట్సాప్ చాట్ను బ్యాక్ అప్ చేసి.. లావీదేవీల గురించి ఆరా తీసినట్లు సమాచారం. సినీ తారలకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చికోటి ప్రవీణ్ కాల్ డేటా సేకరించి.. ఫోన్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖుల జాబితాతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. క్యాసినో లావాదేవీలకు సంబంధించిన సమాచారం వాట్సప్లో లభ్యమైనట్లు తెలుస్తోంది. సోదాల్లో కీలక పత్రాలు, ప్రవీణ్ లాప్టాప్, ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. చికోటికి సంబంధించిన నాలుగు బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. చికోటి ప్రవీణ్కు రాజకీయ నేతలతో ఉన్న పరిచయాలే.. కాకుండా ప్రముఖ సినీ తారలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార వేత్తలతో చేసిన వాట్సాప్ చాటింగ్ డేటాను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చికోటితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలతో ఎర వేసినట్లు తెలిసింది. సినీ తారలతో తయారు చేసిన ప్రోమోలను వాట్సాప్లో ప్రముఖులకు పంపించినట్లు తెలుస్తోంది. నగదు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం మొత్తం, వాట్సాప్లో జరిగిన కీలక డేటాను అధికారులు సేకరించారు. చికోటి ప్రవీణ్కు మొత్తం 200 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. నేపాల్, ఇండోనేషియాలో క్యాసినో ఆడడానికి ఒక్కొక్క కస్టమర్ నుంచి రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేసేవాడు. రూ.ఐదు లక్షల వరకు ఇచ్చిన కస్టమర్లను సాధారణ విమానంలో పంపించడం.. అంతకంటే ఎక్కువ లక్షలు ఇచ్చిన వారిని ప్రత్యేక విమానంలో నేపాల్కు పంపించడం చేసేవాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రేటు డిపాజిట్ నిర్ణయించేవాడు. ఆ విధంగా కష్టమర్లను విదేశాలకు తీసుకువెళ్లి అక్కడ క్యాసినో నిర్వహించేవాడు. ఆ విధంగా వచ్చిన లావాదేవీలు మొత్తం హవాలా రూపంలో జరిగేవి. పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించి.. వెంటనే చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలతో పాటు 8 చోట్ల సోదాలు నిర్వహించారు.
అనంతరం చికోటి ప్రవీణ్ సోమవారం విచారణ నిమిత్తం కార్యాలయానికి రావాలంటూ నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఈ కేసులో చికోటి ప్రవీణ్తో సంబంధాలు ఉన్న పదిమంది సినీ తారలతో పాటు 20 మంది ప్రజాప్రతినిధులకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. సినీ తారలకు సంబంధించిన రెమ్యూరేషన్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మల్లికా షెరావత్కు రూ.కోటి, అమిషా పటేల్ రూ.80 లక్షలు, ఇషారెబ్బకు రూ.40 లక్షలు, గణేశ్ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్ఖాన్ రూ.15 లక్షలు, డింపుల్ హయాతీ రూ.40 లక్షలు, గోవింద 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరందరికీ ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.













