‘ఖిలాడి’ కోసం దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే సాంగ్స్
మాస్ మహారాజా రవితేజకు మరోసారి దరువేస్తున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ‘సారొచ్చారు’ తరవాత వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో మ్యూజికల్ హిట్ రాబోతోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. జయంతీలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. హవీష్ ప్రొడక్షన్లో రూపుదిద్దుకుంటున్న ‘ఖిలాడి’ మూవీకి సంబంధించి ఓ షెడ్యూల్ షూటింగ్ జరిగింది. ప్రస్తుతం చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు రమేష్ వర్మ ఇందులో పాల్గొంటున్నారు.
రవితేజ, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఇప్పటికే మ్యూజికల్ హిట్స్ వచ్చాయి.రవితేజ నటించిన ‘ఖడ్గం’, ‘వెంకీ’, ‘భద్ర’, ‘సారొచ్చారు’ సినిమాలకు దేవి సంగీతం సమకూర్చారు. ‘సారొచ్చారు’ తరవాత రవితేజతో కలిసి దేవి పనిచేయలేదు. సుమారు ఎనిమిదేళ్ల తరవాత మళ్లీ వీరిద్దరి కాంబోలో ‘ఖిలాడి’ వస్తోంది. ఇక దర్శకుడు రమేష్ వర్మతో కూడా దేవీకి ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరూ ‘ఒక ఊరిలో’ సినిమాకు కలిసి పనిచేశారు. కాగా, ‘ఖిలాడి’లో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో రమేష్ వర్మ ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్, ‘లూసిఫర్’ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్, అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ వంటి టాప్ టెక్నీషియన్లతో రమేష్ వర్మ పనిచేస్తున్నారు.శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ కలిసి డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. అమర్ రెడ్డి ఎడిటర్గా పనిచేస్తున్నారు. ‘రాక్షసుడు’ వంటి బ్లాక్బస్టర్ మూవీతో తమది సూపర్ హిట్ కాంబినేషన్ అని సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ నిరూపించారు. ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ బడ్జెట్తో, ఉన్నత ప్రమాణాలతో తీస్తున్నారు.













