సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. గత కొద్దిరోజులుగా రామ్మోహన్ నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటి వరకు ఎంతో మందికి ఆయన సహాయం అందించారు. తాజాగా ఒక సీనియర్ జర్నలిస్ట్కు చిరంజీవి సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. గత మూడు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడున్న సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడును చిరంజీవి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పడమే కాకుండా.. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అన్ని రకాల ఆదుకుంటామని చిరు హామీ ఇచ్చారు. వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ AIG హాస్పిటల్లో చేర్పించేందుకు ఏర్పాటు చేశారు.
జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు ప్రజారాజ్యం పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించారు. రామ్మోహన్ నాయుడుని పరామర్శించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరు ఉంది’’ అని ప్రశంసించారు. ఇలా నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఓవైపు ‘ఆచార్య’ షూటింగ్, మరోవైపు నిహారిక వివాహ మహోత్సవంతో బిజీగా ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడుని చిరంజీవి పరామర్శించడం హర్షనీయం.













