బాలీవుడ్ నటి కంగనాకు అరెస్టు వారెంట్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు ముంబై కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సినీ రచయిత జావెద్ అఖ్తర్ కొన్ని నెలల క్రితం కంగనపై పరువునష్టం దావా వేశారు. గత నెల 1న ఈ కేసును అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారించింది. మార్చి 1వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలంటూ కంగనను కోర్టు ఆదేశించింది. ఈ రోజుతో కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. అయినప్పటికీ కోర్టుకు కంగన హాజరు కాలేదు. ఈ చర్యను కోర్టు ధిక్కరణగా భావించిన న్యాయస్థానం కంగనకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. మరోవైపు కంగనకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంపై ఆమె లాయర్ రిజ్వాన్ సిద్ధికి మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలను బాంబే హైకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో జావెద్ అఖ్తర్ తరపు లాయర్ స్పందిస్తూ పై కోర్టుకు వెళ్లినప్పటికీ కోర్టు ముందు హాజరు కావడం నుంచి కంగన తప్పించుకోలేరని అన్నారు.













