700 కోట్లకు చేరువలో బాహుబలి!!
భారతదేశ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాకు వచ్చిన రూ. 792 కోట్లే అత్యధిక వసూళ్లు. ఈ రికార్డును తుడిచిపెట్టేయడానికి బాహుబలి-2 సిద్ధం అవుతోంది. ఇప్పటికే దాదాపు 700 కోట్ల కలెక్షన్లకు చేరువలోకి వచ్చినట్లు సినీవర్గాల టాక్. ఓపెనింగ్ వీకెండ్లోనే దాదాపు 540 కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలికి.. సోమవారం మేడే కావడం, చాలామందికి సెలవు కావడం బాగా కలిసొచ్చింది. అమెరికా బాక్సాఫీసులో కూడా ఈ సినిమా రికార్డులు బద్దలుకొడుతోంది. అక్కడ ప్రస్తుతం విన్ డీజిల్ నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్8 మొదటి స్థానంలోను, ఒక లాటిన్ సినిమా రెండో స్థానంలోను ఉండగా మూడోస్థానంలో బాహుబలి నిలిచింది.
ఒక దక్షిణ భారత పరిశ్రమకు చెందిన సినిమా హిందీలో విడుదలై… అక్కడ తొలి నాలుగు రోజుల్లో రికార్డు సృష్టించడం ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఒక్క హిందీలోనే తొలి నాలుగు రోజుల్లో 150 కోట్ల రూపాయలు నెట్ వసూలుచేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్టు తరణ్ ఆదర్శ్ తెలిపారు. సోమవారం నాటి కలెక్షన్లతో ఈ సినిమా అన్ని రికార్డులనూ నాకౌట్ బిజినెస్తో బుల్డోజ్ చేసిందని, ఇప్పటికి ఇంకా ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, మొత్తం వివరాలు మళ్లీ చెబుతానని అన్నారు. అప్పటికే కేవలం హిందీ వెర్షన్లోనే తొలి నాలుగు రోజుల్లో 150 కోట్లు సాధించిన విషయాన్ని ఆయన ప్రకటించారు. అదే సమయంలో రాజమౌళి, బాహుబలి టీమ్ కలిసి భారతీయ సినిమా గర్వంగా నిలిచేలా చేశారంటూ రాజమౌళిని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. అలాగే, ఒక్క అమెరికాలోనే ఓపెనింగ్ వీకెండ్లో ఒక భారతీయ సినిమా రూ. 65.65 కోట్లు సాధించగలదని ఎవరైనా కనీసం ఊహించగలరా అంటూ.. యూఎస్ రికార్డుల గురించి కూడా వెల్లడించారు.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా భారతదేశంలో 6500 స్క్రీన్లతో పాటు ప్రపంచవ్యాప్త్ంగా 9వేల స్క్రీన్లలో విడుదలైంది. దాదాపు మరో వారం రోజుల వరకు కూడా చాలావరకు థియేటర్లలో టికెట్లన్నీ అప్పుడే అమ్ముడైపోయాయి. సినిమాకు అంతగా వసూళ్లు వస్తాయా అని చాలామంది వ్యక్తం చేసిన అనుమానాలను ఈ వసూళ్లు పటాపంచలు చేశాయి.













