ఓటిటి ప్లాట్ ఫామ్ లో సక్సెస్ రేట్ లేకపోవడంతో సినీ పరిశ్రమకు ఊరట
కోవిడ్ -19 పుణ్యమా అని సినిమా హాల్స్ ముల్టిఫ్లెక్ లు మూతపడి మూడు నెలలు అవుతున్న పరిస్థితులలో జనాలకి ఎంటర్టైన్మెంట్ కలిగించే సినిమాలు దూరం అయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు అందరికీ ఒటీటీ ప్లాట్ ఫామ్స్ మాత్రమే కొత్త సినిమాలకు మార్గాలుగా మారాయి.
ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా అమెజాన్ ఒటీటీ ప్లాట్ ఫామ్ లో భారీ అంచనాలతో భారీ పబ్లిసిటీతో విడుదల అయిన అమితాబ్ ‘గులాబో సితాబో’ కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ అమృతారామం వంటి మూవీల పై సగటు ప్రేక్షకుడు పెదవి విరవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి అత్యంత భారీ అంచనాలు ఉన్న మొదటి రెండు సినిమాలకు విమర్శకుల వద్ద నుండి కూడ చెప్పుకోతగ్గ ప్రశంసలు లభించలేదు. దీనితో ఈరెండు సినిమాలు జనంకు నచ్చక అమెజాన్ ప్రైమ్ లో పెద్దగా చూడటంలేదా లేదంటే ధియేటర్లలో సినిమా చూసిన ఫీలింగ్ ఒటీటీ ప్లాట్ ఫామ్ పై వస్తున్న ఈ సినిమాలను బుల్లితెర పై కంప్యూటర్ స్క్రీన్స్ పై సెల్స్ లో స్మార్ట్ ఫోన్స్ లో చూడటానికి జనం పూర్తిగా ఇష్టపడటం లేదా అన్నవిషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ఓటీటీ ల వల్ల ధియేటర్లు శాశ్వతం గా మూత పడిపోతాయి అన్న విశ్వాసానికి అడ్డుకట్ట పడిందని సినీ పరిశ్రమ భావిస్తోంది.
ధియేటర్లలో సినిమాలు చూసినప్పుడు సగటు ప్ర్క్షకుడు పొందే అనుభూతి ఈ ఒటీటీ లైవ్ స్ట్రీమింగ్ వల్ల రాదు అన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండటంతో ధియేటర్ల యజమానులు ఆనందంతో ఉన్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా కరోనా ఉద్రితి కొనసాగుతూ ఉన్నా అన్నిరంగాలకు మినహాయింపులు ఇస్తున్న పరిస్థితులలో ధియేటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది అన్నవార్తలు కూడా వస్తున్నాయి.
ధియేటర్ల ఓపెనింగ్ కు ప్రభుత్వాలు అనుమతించినా ముందుగా మల్టీ ఫ్లెక్స్ లలో అనుమతులు ఇచ్చి అక్కడ ఆరోగ్యపరం తీసుకునే జాగ్రత్తలు, సామాజిక దూరం బాగా పాటించే విధంగా కఠిన నిబంధనలు విధించి ఆ నిబంధనలను సింగిల్ స్క్రీన్ ధియేటర్లు కూడ పాటించి తీరాలి అన్న కండిషన్స్ తో ఆగష్టు ప్రాంతంలో ధియేటర్లు ఓపెన్ కావడం ఖాయం అని కూడా అంటున్నారు. మరి రోజు రోజు కు కరోనా వైరస్ భీకరంగా విజృంభిస్తున్న తరుణం లో ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.













