క్రిష్ పక్క మరో డైరెక్టర్ పేరు
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్ జాగర్లమూడి. గమ్యం లాంటి సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన ఎన్నో ప్రయోగాలు చేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా ను స్టార్ట్ చేశాడు. కానీ సినిమా షూటింగ్ అంతా అయ్యాక అనుకోని వివాదం వచ్చి పడింది. క్రిష్ పనితీరు నచ్చకపోవడంతో ఆయన్ని పక్కన పెట్టి కంగనానే డైరెక్టర్ అవతారమెచ్చి రీషూట్స్ చేసింది.
ముందు క్రిష్ తో పాటూ తన పేరు కూడా డైరెక్టర్ గా వేసుకున్న కంగనా, తర్వాత క్రిష్ పేరును పూర్తిగా తొలగించేసింది. దీంతో రిలీజ్ టైమ్ లో క్రిష్ అబ్జెక్షన్ చెప్పాడు. ఆ సినిమాలో 75% తాను తీసిన సీన్లే ఉన్నాయని, తన పట్ల కంగనా చాలా అవమానకరంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు మరోసారి క్రిష్ పక్కన మరో డైరెక్టర్ పేరు చేర్చాల్చి వచ్చింది. ఆ సినిమానే హరిహర వీరమల్లు.
క్రిష్ దర్శకత్వంలో మూడేళ్ల కిందట మొదలైన ఈ సినిమాకు పవన్ అందుబాటులో ఉన్నన్ని రోజులు దర్శకత్వం చేసింది క్రిష్. తర్వాత కరోనా, పవన్ వేరే సినిమాలు ఒప్పుకోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల సినిమా చాలా ఆలస్యమైంది. ఎంతకీ సినిమా పూర్తి కాకపోవడం, పవన్ గతేడాది నుంచి ఈ సినిమాకు అందుబాటులో లేకపోవడం వల్ల క్రిష్ తన దారి తను చూసుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే అనుష్క తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. పవన్ మళ్లీ అందుబాటులోకి వచ్చాక వీరమల్లును పూర్తి చేసి రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ వీరమల్లు స్పెషల్ టీజర్ లో డైరెక్టర్ గా క్రిష్ పేరు పక్కన నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ పేరు కూడా వచ్చి చేరింది. మరి ఇది క్రిష్ అనుమతితో సామరస్య పూర్తకంగా జరిగిందా లేక మణికర్ణిక లానే ఇది కూడా రిలీజ్ టైమ్ లో వివాదాలకు దారి తీస్తుందా అన్నది చూడాలి.













