మరో కొత్త సమస్య తెచ్చి పెట్టుకున్న పృథ్వీ!
సినిమా రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా ఒక్కసారి వెనకపడినా, ఏదైనా వివాదంలో ఇరుక్కున్నా దాని నుంచి బయట పడడానికి ఎంతో కాలం పడుతుంది. దానికితోడు అనుకోని ఘటనలు కూడా వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఇప్పుడు నటుడు పృథ్వీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. కమెడియన్గా మంచి స్వింగ్లో ఉన్న టైమ్లోనే ఆయను ఎస్విబిసి ఛైర్మన్ పదవి వరించింది. ఆయనకు ఈ పదవి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది కూడా. అయితే ఆయన ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేకపోయారు. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపులు లీక్ అవ్వడంతో ఆయన ఇరుకున్న పడ్డారు. ఆ ఆడియో టేపులో ఉన్నది తన గొంతు కాదని, తనకు ఎస్విబిసి పదవి రావడం ఇష్టంలేని వారే తనని ఈ కేసులో ఇరికించారని బుకాయించే ప్రయత్నం చేశారు.
కానీ, అధిష్టానం మాత్రం ఆయనతో ఎస్విబిసి ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. దాంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. ఇదిలా ఉంటే మంగళవారం పృథ్వి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ బంజారా హిల్స్లోని క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఓ కారును ఢీకొట్టడంతో పృథ్వీ కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. గత కొంతకాలంగా షూటింగులు లేకపోవడం, ఆడియో టేపుల వ్యవహరాలతో సతమతమవుతున్న పృథ్వికి ఆమధ్య కరోనా సోకింది. దాని నుంచి కోలుకున్న ఆయనకు ఇప్పుడు ఈ కొత్త సమస్య వచ్చి పడింది.













